ADB :ట్రైబల్ వెల్ఫేర్ హాస్టల్ను సందర్శించిన మున్సిపల్ చైర్పర్సన్.
By
Rathnakar Darshanala
ట్రైబల్ వెల్ఫేర్ హాస్టల్ను సందర్శించిన మున్సిపల్ చైర్పర్సన్.
ఆదిలాబాద్, నేటివార్త ,సెప్టెంబర్ 02:
ఆదిలాబాద్ పట్టణంలోని భుక్తాపూర్ వార్డు నంబర్ 49 లో ఉన్న ట్రైబల్ వెల్ఫేర్ బాలికల హాస్టల్ను మున్సిపల్ చైర్పర్సన్ బండారి అనూషా సతీష్ ఆకస్మికంగా సందర్శించారు.
హాస్టల్లోని విద్యార్థినులతో కలిసి సహపంక్తి భోజనం చేసి, భోజన నాణ్యతను స్వయంగా పరిశీలించారు. వంటశాలను పరిశీలించి అన్నం, పప్పు, చికెన్, వెజిటబుల్ కర్రీ, పెరుగు తదితర ఆహార పదార్థాలను రుచి చూశారు.
విద్యార్థినులకు నాణ్యమైన భోజనం అందేలా అధికారులు శ్రద్ధ తీసుకోవాలని సూచించారు.
అనంతరం హాస్టల్లో నిర్వహిస్తున్న టీజ్ ఉత్సవాల్లో పాల్గొని, విద్యార్థినులతో కలిసి నృత్యం చేసి వారిలో ఉత్సాహాన్ని నింపారు. వారి సమస్యలు, అవసరాలను అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా చైర్పర్సన్ మాట్లాడుతూ, జిల్లా ఇన్చార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు, ట్రైబల్ వెల్ఫేర్ మంత్రి ఆడ్లూరి లక్ష్మణ్ ఆదేశాల మేరకు ప్రతి వారం ఒకటి రెండు హాస్టళ్లను ఆకస్మికంగా సందర్శించి భోజన నాణ్యతను పరిశీలిస్తున్నామని తెలిపారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు క్షేత్రస్థాయిలో సక్రమంగా అమలవుతున్నాయా లేదా అని పరిశీలిస్తున్నామన్నారు.
విద్యార్థినుల సంక్షేమానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందని, హాస్టళ్లలో సమస్యలు ఉంటే పరిష్కరిస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్, వార్డెన్, సిబ్బంది, విద్యార్థినులు పాల్గొన్నారు.
Comments