చదవాలి అంటే... నడవాలి..విద్యార్థులకు తప్పని RTC కష్టాలు.

Rathnakar Darshanala
చదవాలి అంటే... నడవాలి..!
బస్సు ఫుల్‌.. విద్యార్థినులకు నడక తప్పని పరిస్థితి

శ్రీరంగాపురం, సెప్టెంబర్ 2 (నేటివార్త):

శ్రీరంగాపురం మండల కేంద్రంలోని జడ్పీహెచ్‌ఎస్‌లో చదువుతున్న విద్యార్థినులకు బస్సు ప్రయాణం ఇబ్బందిగా మారింది. శ్రీరంగాపురం నుంచి నాగరాల గ్రామానికి సుమారు 5 కిలోమీటర్లు, 

పూర్గచర్ల గ్రామానికి కూడా సుమారు 5 కిలోమీటర్ల దూరం ఉంది. ఈ గ్రామాల నుంచి విద్యార్థినులు ప్రతిరోజూ పాఠశాలకు రాకపోకలు సాగిస్తున్నారు.

అయితే బస్సులు సరైన సమయానికి రాకపోవడంతో పాటు, వచ్చే బస్సులు ఇప్పటికే ప్రయాణికులు, విద్యార్థులతో ఫుల్‌గా ఉండటంతో నగరాల గ్రామానికి చెందిన విద్యార్థినులు బస్సు ఎక్కలేక నడుచుకుంటూ పాఠశాలకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది.

ఒకే సమయంలో రెండు గ్రామాల నుంచి విద్యార్థులు పెద్ద సంఖ్యలో రావడంతో బస్సులో రద్దీ మరింత పెరుగుతోంది. దీంతో 5 కిలోమీటర్ల దూరం ఉన్నా బస్సు సౌకర్యం సక్రమంగా లేక విద్యార్థినులు నడకబాట పడుతున్నారు.

విద్యార్థుల పాఠశాల సమయాలను దృష్టిలో ఉంచుకుని బస్సుల వేళలను సర్దుబాటు చేయడంతో పాటు, అవసరమైన సమయంలో అదనపు బస్సు సౌకర్యం కల్పించాలని విద్యార్థులు, తల్లిదండ్రులు కోరుతున్నారు. 

చదువుకునేందుకు వెళ్లే విద్యార్థినులకు ప్రయాణ ఇబ్బందులు లేకుండా ఆర్టీసీ అధికారులు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
Comments