అయ్యో...బిడ్డ. పండగ పూట విషాదం... Netivartha...

Rathnakar Darshanala
అయ్యో...బిడ్డ. పండగ పూట విషాదం... Netivartha...
*అమ్మమ్మ ఇంటికి వచ్చి.. అనంతలోకాలకు ఇద్దరు బాలురు*

- పండుగ పూట విషాదం.. మొండి కుంటలో పడి ఇద్దరి మృతి.

- బహిర్భూమికి వెళ్లిన సమయంలో ప్రమాదం.

ములుగు జిల్లా, ఆగస్టు 30: 

రాఖీ పండుగ సందర్భంగా అమ్మమ్మ ఇంటికి వచ్చిన ఇద్దరు బాలురు ప్రమాదవశాత్తు కుంటలో పడి మృతి చెందిన విషాద ఘటన ములుగు జిల్లాలో చోటుచేసుకుంది. 

ఈ ఘటనతో కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.ములుగు జిల్లా జీవంతరావుపల్లి అమ్లెట్ విలేజ్ పరిధిలోని గణేష్‌లాల్‌పల్లి (మహరాజ్‌పల్లి) గ్రామ సమీపంలోని మొండి కుంటలో పడి మాలోత్ వినయ్ కుమార్ (15), రాజేష్ (12) మృతి చెందారు. మృతులు మంగపేట మండలం కమలాపురం గ్రామానికి చెందిన వారిగా గుర్తించారు.

రాఖీ పండుగను పురస్కరించుకుని ఇద్దరు బాలురు తమ అమ్మమ్మ ఇంటికి వచ్చారు. ఈ క్రమంలో బహిర్భూమికి వెళ్లిన సమయంలో ప్రమాదవశాత్తు మొండి కుంటలో పడిపోయినట్లు సమాచారం. 

నీటిలో మునిగిపోవడంతో ఇద్దరూ మృతి చెందారు.మృతులు సునీత–యాకూబ్ దంపతుల పిల్లలు. 
పండుగ సందర్భంగా సంతోషంగా అమ్మమ్మ ఇంటికి వచ్చిన తమ పిల్లలు విగతజీవులుగా మారడంతో తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు బాలురు మృతి చెందడంతో కమలాపురం గ్రామంతో పాటు ఘటన జరిగిన గణేష్‌లాల్‌పల్లి పరిసరాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Comments