ఎన్నికల సమయం లో నమోదయ్యే ప్రతి ఫిర్యాదు పరిష్కారానికి చర్యలు - కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి ముజమ్మిల్ ఖాన్.
By
Rathnakar Darshanala
ఎన్నికల సమయంలో నమోదయ్యే ప్రతి ఫిర్యాదు పరిష్కారానికి చర్యలు - కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి ముజమ్మిల్ ఖాన్.
* నోడల్ అధికారి ఆధ్వర్యంలో క్షేత్రస్థాయి ఎన్నికల బృందాలతో సమన్వయం
* సి-విజల్ యాప్ పై విస్తృత స్థాయి ప్రచారం కల్పించాలి
* సామాజిక మాధ్యమాల్లో అసత్య ప్రచారాలు తిప్పికొట్టేందుకు చర్యలు
* సమీకృత జిల్లా ఫిర్యాదుల పర్యవేక్షణ కేంద్రం పనితీరును వివరించిన జిల్లా కలెక్టర్
నేటి వార్త పెద్దపల్లి ప్రతినిధి అక్టోబర్ 31
రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నిర్వహణ సజావుగా నిర్వహించేందుకు సమీకృత జిల్లా ఫిర్యాదుల పర్యవేక్షణ కేంద్రం ద్వారా క్షేత్ర స్థాయి సిబ్బందినీ సమన్వయం చేసుకుంటూ నమోదయ్యే ప్రతి ఫిర్యాదు పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి ముజమ్మిల్ ఖాన్ అన్నారు.
మంగళవారం సమీకృత జిల్లా కలెక్టరేట్ లో కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి ముజమ్మిల్ ఖాన్ ఎన్నికల సందర్భంగా ఏర్పాటు చేసిన సమీకృత జిల్లా ఫిర్యాదుల పర్యవేక్షణ కేంద్రం పని తీరును పాత్రికేయులకు వివరించారు.
జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ మాట్లాడుతూ, భారత ఎన్నికల కమిషన్ నిర్దేశించిన ఎన్నికలప్రవర్తన నియమావళిని, నిబంధనలను నిష్పక్షపాతంగా అమలు చేస్తూ, ప్రతి ఒక్క అభ్యర్థికి సమాన హక్కులు కల్పిస్తూ పారదర్శకంగా ఎన్నికలు నిర్వహించడం జరుగుతుందని అన్నారు.
సమీకృత జిల్లా ఫిర్యాదుల పర్యవేక్షణ కేంద్రానికి జిల్లా పశు సంవర్ధక శాఖ అధికారి ని నోడల్ అధికారిగా నియమించామని, నోడల్ అధికారి జిల్లాలో ఎన్నికలకు సంబంధించి వచ్చే ఫిర్యాదులపై క్షేత్రస్థాయి సిబ్బందిని ఎప్పటికప్పుడు అలర్ట్ చేస్తూ , వాటిని త్వరితగతిన పరిష్కారం జరిగేలా చర్యలు తీసుకుంటారని అన్నారు.
ఎన్నికలలో జరిగే వివిధ రకాల ఉల్లంఘనలపై 1950 టోల్ ఫ్రీ నెంబర్, సి- విజల్ యాప్ ద్వారా ప్రజల నుంచి ఫిర్యాదులు వస్తున్నాయని, వివిధరాజకీయ పార్టీల ప్రతినిధులు, వివిధ వర్గాలకుచెందిన ప్రజలు నేరుగా ఫిర్యాదులు అందిస్తున్నారని కలెక్టర్ తెలిపారు.
1950 టోల్ ఫ్రీ నెంబర్ నుంచి ఫిర్యాదుల స్వీకరణ కోసం బ్లాక్ 4 లో 24 గంటల పాటు పనిచేసే కాల్ సెంటర్ ను ఏర్పాటు చేశామని, ఇప్పటి వరకు 1045 ఫిర్యాదులు వచ్చాయని, ప్రజల నుంచి వచ్చే ప్రతి ఫిర్యాదును రిజిస్టర్ లో నమోదు చేసుకొని వెంటనే నోడల్ అధికారి పశు సంవర్ధక శాఖ అధికారికి సమాచారం అందించి, సంఘటన జరిగే ప్రాంతానికి సమీపంలో ఉన్న ఎన్నికల బృందాలను అలర్ట్ చేసి సమస్య పరిష్కరిస్తున్నామని అన్నారు.
మొబైల్ ఫోన్ నుంచి సి విజల్ యాప్ ద్వారా ప్రజలు ఫిర్యాదు చేయవచ్చని, సి విజల్ యాప్ లో లైవ్ వీడియో రికార్డింగ్, లైవ్ ఫోటో మాత్రమే అప్ లోడ్ చేయవచ్చని అన్నారు. సి విజల్ యాప్ ద్వారా ఫిర్యాదు చేసిన వారి ఫోన్ నెంబర్, పేరు గోప్యంగా ఉంటాయని అన్నారు.
సి విజల్ యాప్ నుంచి వచ్చే ఫిర్యాదులను బ్లాక్ 3 లో ఉన్న బృందం పరిశీలించి, రిజిస్టర్ లో నమోదు చేసి, జిపిఎస్ వినియోగిస్తూ నోడల్ అధికారి ద్వారా సమీపంలో ఉన్న ఎన్నికల బృందాలను అలర్ట్ చేసి వంద నిమిషాలలో చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు . సివిజల్ యాప్ పై విస్తృత ప్రచారం కల్పించాలని కలెక్టర్ ఈ సందర్భంగా కోరారు.
సమీకృత జిల్లా ఫిర్యాదుల పర్యవేక్షణ కేంద్రంకు వచ్చే ప్రతి ఫిర్యాదును రిజిస్టర్ లో నమోదు చేసుకుని వెంటనే పశు సంవర్ధక శాఖ అధికారి ద్వారా క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న ఫ్లయింగ్ స్క్వాడ్, స్టాటిక్ సర్వేలెన్సు బృందాలకు సమాచారం అందిస్తున్నామని అన్నారు.
సమీకృత జిల్లా ఫిర్యాదుల పర్యవేక్షణ కేంద్రంలో బ్లాక్ 5 లో ఎలక్ట్రానిక్ మీడియా మానిటరింగ్ బృందం ఏర్పాటు చేశామని, ఎన్నికల సమయంలో అనుమతి లేకుండా ర్యాలీలు నిర్వహణ, ప్రచార సమయం గడిచిన తర్వాత ర్యాలీలు సభలు నిర్వహించడం గమనించినా, డబ్బు, మద్యం పంపిణీ వంటి సంఘటనల వివరాలు గమనించినా వెంటనే నోడల్ అధికారి ద్వారా క్షేత్రస్థాయి బృందాలను అలర్ట్ చేస్తామని అన్నారు.
సామాజిక మాధ్యమాల మానిటరింగ్ సెల్ బ్లాక్ 6 లో ఏర్పాటు చేసి ఎన్నికల నిర్వహణ పట్ల అపోహలు, దుష్ప్రచారాలు గమనించిన వెంటనే నోడల్ అధికారి అయిన పశు సంవర్ధక శాఖ అధికారి ద్వారా సంబంధిత రిటర్నింగ్ అధికారికి సమాచారం చేరే విధంగా సత్వర చర్యలు తీసుకుంటా మని అన్నారు.
ఎన్నికల ప్రచారంలో భాగంగా వివిధ రాజకీయ పార్టీల అభ్యర్థులు ప్రచారం సమయంలో వినియోగించే ఆడియో, వీడియోలను పరిశీలించి అనుమతులు ఇచ్చేందుకు బ్లాక్ 1 లో మీడియా సర్టిఫికేషన్ మానిటరింగ్ సెంటర్ ఏర్పాటు చేశామని తెలిపారు.
సమీకృత ఫిర్యాదు కేంద్రంలో 1950 టోల్ ఫ్రీ నెంబర్, సామాజిక మాధ్యమాలు, ఎలక్ట్రానిక్ మీడియా, లోకల్ కేబుల్ చానల్స్ మొదలగు వివిధ సాధనాల ద్వారా వచ్చే ప్రతి ఫిర్యాదును క్షేత్రస్థాయిలో ఫ్లయింగ్ స్క్వాడ్, స్టాటిక్ సర్వేలెన్స్, వీడియో సర్వెలెన్స్ బృందాలకు కేటాయించే సమయంలో సివిజల్ యాప్ లోసుమోటోగా చేసే విధంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ పేర్కొన్నారు.
జిల్లాలో ఎన్నికల నిర్వహణకు సంబంధించి ప్రతి బృందం మూడు షిఫ్టులలో 24 గంటల పాటు పనిచేస్తుందని, దానికి అనుగుణంగా సిబ్బంది నియామకం, అవసరమైన ఏర్పాట్లు ఛేసుకున్నామని అన్నారు.
ఎన్నికల సందర్భంగా జిల్లాలో నమోదయ్యే ఎన్నికల కేసుల ఎఫ్.ఐ.ఆర్ కేసులు, 1950 టోల్ ఫ్రీ నెంబర్, సివిజల్ యాప్ ద్వారా వచ్చే ఫిర్యాదులు, పరిష్కరించిన ఫిర్యాదులు, జప్తు చేసిన నగదు, బంగారం ఇతర ముఖ్యమైన ఆభరణాల వివరాలు, విడుదల చేసిన నగదు, బంగారం, ఇతర అభరణాల వివరాలు ప్రతిరోజు మీడియాకు అందే విధంగా జిల్లా పౌర సంబంధాల అధికారి చర్యలు తీసుకుంటారని కలెక్టర్ తెలిపారు.
ఈ కార్యక్రమంలో జిల్లా పశు సంవర్థక శాఖ అధికారి రవీందర్ రెడ్డి, సర్వే ల్యాండ్ రికార్డ్స్ ఏ.డి. శ్రీనివాస్, జిల్లా ఉపాధి అధికారి వై.తిరుపతి, జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖ అధికారి మెరాజ్ మహమూద్, కలెక్టరేట్ పరిపాలన అధికారి శ్రీనివాస్, సోషల్ మీడియా ఇంచార్జీ నరహరి, ఈ.డి.ఎం. కవిత, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
Comments