భూ భారతితో భూ సమస్యలకు పరిష్కారం.

Rathnakar Darshanala
భూ భారతితో భూ సమస్యలకు పరిష్కారం.
*అవగాహన సదస్సుకు హాజరైన కలెక్టర్,ఎమ్మెల్యే కవ్వంపల్లి*

నేటివార్త ప్రతినిధి రాకం సుమన్ ఏప్రిల్ 19

భూ భారతితో భూ సమస్యలకు పరిష్కారం లభిస్తుందని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా వెల్లడించారు.భూ భారతి చట్టంపై అవగాహన సదస్సును ఇల్లంతకుంట మండల కేంద్రంలో శనివారం ఏర్పాటు చేశారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా,మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ హాజరయ్యారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ,ధరణి స్థానంలో కొత్త భూమి హక్కుల రికార్డు భూ భారతి రాష్ట్ర ప్రభుత్వం అమలులోకి తీసుకు వచ్చిందని తెలిపారు.

హక్కుల రికార్డులలో తప్పుల సవరణకు అవకాశం ఉందని,రిజిస్ట్రేషన్,మ్యుటేషన్ చెయ్యడానికి ముందు భూముల సర్వే ఉంటుందని వివరించారు.పెండింగ్ సాదా బైనామా దరఖాస్తుల పరిష్కారం లభిస్తుందని వెల్లడించారు.

వారసత్వంగా వచ్చిన భూములకు మ్యుటేషన్ చేసే ముందు నిర్ణీత కాలంలో విచారణ చేస్తారని,భూమి హక్కులు ఎలా సంక్రమించినా మ్యుటేషన్ చేసి రికార్డులలో నమోదు చేస్తారని వివరించారు.

మ్యాప్ జియో ట్యాగింగ్ తో పాస్ బుక్కులు జారీ చేస్తామని తెలిపారు.భూ సమస్యల పరిస్కారానికి రెండు అంచెల అప్పీల్ వ్యవస్థ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిందని,రిజిస్ట్రేషన్ అనంతరం భూధార్ కార్డుల జారీ చేస్తుందని తెలిపారు.

ఇంటి స్థలాలకు,ఆబాది,వ్యవసాయేతర భూములకు హక్కుల రికార్డు ఉంటుందని వివరించారు.మోసపూరితంగా హక్కుల రికార్డులు మార్చి ప్రభుత్వం,భూదాన్,అసైన్డ్,ఎండోమెంట్,వర్ఫ్ భూములకు పట్టాలు పొందితే రద్దు చేసే అధికారం ఉంటుందని కలెక్టర్ స్పష్టం చేశారు.
అనంతరం మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ మాట్లాడుతూ ధరణి చట్టంలో లోపాలతో రైతులు,ప్రజలు ఎన్నో సంవత్సరాలుగా ఇబ్బందులు పడ్డారని గుర్తు చేశారు.

వీటిని పరిష్కరించేందుకు సుదీర్ఘ సమీక్షలు,నిపుణుల సలహాలు,సూచనలతో రాష్ట్ర ప్రభుత్వం భూభారతి చట్టాన్ని తీసుకువచ్చిందని వెల్లడించారు.భూ సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం సరైన ప్రణాళికతో భూ భారతి చట్టాన్ని తీసుకువచ్చిందని తెలిపారు.

భూ సమస్యలతో బాధపడే వారంతా చట్టాన్ని సద్వినియోగం చేసుకొని హక్కులు పొందాలని పిలుపునిచ్చారు.రైతులకు ఉచిత న్యాయ సహాయం అందజేస్తారని వివరించారు.గ్రామ రెవిన్యూ రికార్డుల నిర్వహణ ఉంటుందని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో సిరిసిల్ల ఆర్డీవో రాధాబాయి,తహసిల్దార్ ఫారూక్,అధికారులు,సిబ్బంది,రైతులు,ప్రజలు,ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
Comments