చిమ్మ చీకట్లు చీల్చి...చిరుదివ్వెల వెలుగులు విరజిమ్మే వేడుక.

Rathnakar Darshanala
చిమ్మ చీకట్లు చీల్చి...చిరుదివ్వెల వెలుగులు విరజిమ్మే వేడుక.
-నేడే దీపావళి పండుగ 

నేటి వార్త రాయికల్ అక్టోబర్ 30:

అజ్ఞానమనే చిమ్మ చీకటిని తొలగించి జ్ఞానమనే వెలుగులను విరజిమ్మే పండుగ దీపావళి వేడుకని, చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా ప్రజలు ఆనందంతో జరుపుకునేదే దీపావళి పండుగ అని తెలుగు పండితులు చెరుకు మహేశ్వర శర్మ తెలిపారు.

దీపం ఉన్న చోట జ్ఞానసంపద ఉంటుందని దీపం లక్ష్మీదేవి దేవీ స్వరూపమని శాస్త్రాలు చెపుతున్నాయి.ఇంట్లోని ప్రతికూల శక్తులను తొలగించి.. నూతన వెలుగులు తీసుకొచ్చే గొప్ప పండుగ  దీపావళి అని చెరుకు మహేశ్వర శర్మ అన్నారు.

హిందువులతో పాటు జైనులు, బౌద్ధులు, సిక్కులు, తదితర మతస్తులు ఆరోగ్యం, ఐశ్వర్యం సుఖము సంతోషం సౌభాగ్యాన్ని కోరుకుంటూ చేసుకునే పర్వదినమే దీపావళి అని తెలిపారు.

ప్రతియేటా 
ఆశ్వయుజ బహుళ అమావాస్య రోజు ఈ పండుగను జరుపుకుంటారని తెలిపారు.
ఈ ఏడాది అక్టోబర్ 31 నవంబర్ 1 గురు, శుక్ర వారాల్లో దీపావళి పండుగ ఉందని , ఈ సందర్భంగా దీపావళి విశిష్టతను చెరుకు మహేశ్వర శర్మ వివరించారు.

పురాణ కథనం ప్రకారం.. భూదేవి, వరహా స్వామికి అసుర సమయంలో జన్మించిన నరకాసురుడు.. శ్రీహరి చేతిలో చావులేని విధంగా తల్లి చేతిలోనే మరణించేలా వరం పొందుతాడు. 

వరగర్వంతో లోకకంటకుడిగా తయారైన నరకుడు ముల్లోకాలను పట్టిపీడించాడు. నరకాసురుడి బాధలు భరించలేని దేవతలు, మునులు, గంధర్వులు శ్రీహరికి తమ గోడు వెళ్లబోసుకున్నారు. 

వారి మొర ఆలకించిన శ్రీమహావిష్ణువు ద్వాపర యుగంలో కృష్ణుడిగా అవతరించి సత్యభామతో నరకాసురుని సంహరింపజేశాడు. 

నరకాసుర సంహారంతో అందరూ అనందంగా పండుగ చేసుకున్నారు. చతుర్దశి నాడు నరకుడి మరణించగా, ఆ తర్వాత రోజు దీపాలు వెలిగించి సంబరాలు చేసుకున్నారు. 

దీపావళి అంటే దీపాల వరుస అన్ని అర్థం. కొన్ని ప్రాంతాల్లో దీపావళిని ఐదు రోజుల పండుగగా జరుపుకుంటారు. ఆశ్యయుజ బహుళ త్రయోదశితో ప్రారంభమైన దీపావళి వేడుకలు.. 

కార్తీక శుద్ద విదియ 'భగినీహస్త భోజనం'’తో ముగుస్తుంది.

ఆశ్వయుజ బహుళ త్రయోదశినే ధన త్రయోదశిగా జరుపుకుంటారు. ఇంటిని శుభ్రం చేసి, పాత సామాన్లను శుభ్రం చేస్తారు. 

కొత్తగా కొనుగోలు చేసిన వెండి, బంగారు ఆభరణాలు ఈ రోజున పూజలో పెడితే ధనలక్ష్మి అష్టైశ్వర్యాలను ప్రసాదిస్తుందని విశ్వసిస్తారు. అందుకే ధనలక్ష్మీ, కుబేరులను భక్తిశ్రద్ధలతో కొలుస్తారు.

 బంగారం, వెండి కాకుండా ధన త్రయోదశి రోజు ఏ వస్తువు కొనుగోలు చేసి శుభం జరుగుతుందంటారు. అమృతం కోసం దేవతలు క్షీరసాగరాన్ని మధించినప్పుడు ధన త్రయోదశి రోజునే లక్ష్మీ దేవి ఉద్భవించినట్టు పురాణాలు పేర్కొంటున్నాయి. 

అందుకే ఈ రోజున తనను పూజించిన వారికి లక్ష్మీదేవి అనుగ్రహిస్తుంది. ఏ వస్తువు ఇంటికి తెచ్చినా లాభదాయకం అవుతుందని చాలా మంది నమ్ముతారు.ఆశ్వయుజ అమావాస్య రోజునే దీపావళి పండగ. ఈ సమయంలో ఇంటిని శుభ్రం చేసి,

 రకరకాల పిండి వంటలు తయారు చేస్తారు. కొన్ని ప్రాంతాల్లో సంధ్యా సమయంలో  ఎండిన ఈత కమ్మలు  గోగు కర్రలకు గుడ్డ పీలికలతో కాగడాలు కట్టి, వెలిగించి, 

గుమ్మాల్లో నేల మీద కొడుతూ... ‘దిబ్బి దిబ్బి దీపావళి, మళ్ళీ వచ్చే నాగులచవితి, పుట్ట మీద జొన్నకర్ర, పుటుక్కు దెబ్బ! అని పాడతారు. గోగు కర్రల్ని ఎవరూ తొక్కని చోటవేసి, 

వెనక్కి తిరిగి చూడకుండా కాళ్లు కడుక్కుని లోపలికి వెళ్లి శుభానికి మిఠాయి తింటారు. ఇలా చేస్తే పిల్లలు ఆరోగ్యంగా ఎదుగుతారని విశ్వసిస్తారు .

తర్వాత ఇంటిని దీపాలతో అలంకరిస్తారు. మట్టి ప్రమిదలు, నువ్వుల నూనె వాడటం మంచిది. లక్ష్మీదేవికి ఇష్టమైన నువ్వుల నూనెతో దీపాలు వెలిగిస్తే అమ్మ అనుగ్రహం లభిస్తుంది. గుమ్మం, తులసి దగ్గర మాత్రం తప్పనిసరిగా మట్టి ప్రమిదలో నువ్వుల నూనె లేదా ఆవు నేతితో దీపాలు వెలిగించాలి. 

ప్రదోష సమయంలోనే లక్ష్మి దేవి పూజ చేస్తారు. ధనలక్ష్మి పూజ ఈ రోజు చేస్తే ధన ధాన్యాలు, అష్టైశ్వర్యాలు సంప్రాప్తిస్తాయి. 

దీపావళి రోజున లక్ష్మీపూజతో తమ వ్యాపారం వృద్ధి చెందుతుందని వ్యాపారులు నమ్ముతారు. కొత్త బంగారు, వెండి ఆభరణాలు పూజలో పెడితే శుభప్రదమని భావిస్తారు. 

ఖాతా పుస్తకాలు తెరుస్తారు.నూతన వ్యాపార వాణిజ్యాలు ప్రారంభిస్తారు . దీపావళి నోములు  కేదారేశ్వర స్వామి వ్రతములు చేసుకుంటారని చెరుకు మహేశ్వర శర్మ వివరించారు.
Comments